COVID19 Outbreak in Andhra Pradesh | Photo: Pixaby/ Twitter

Amaravathi, June 06: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 210 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,460 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3588 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే 12,771 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అయితే కేసులు పెరిగినా, కొత్తగా నమోదైన కరోనా మరణాలేమి లేకపోవడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 73 గా ఉంది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 29 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2323 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1192 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్న వారి సంఖ్యను అధికారులు విడిగా చూపుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన మొత్తం 210 కేసుల్లో 161 ఏపి పరిధిలోనివి కాగా, మిగిలిన 49 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 741 మందికి వైరస్ నిర్ధారణ కాగా, ప్రస్తుతం వీరిలో 467 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 131 మందికి పాజిటివ్ అని తేలగా, ప్రస్తుతం 127 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.