Amaravathi, July 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కర్ఫ్యూను ఈ నెల 14 వరకు పొడిగిస్తూ మరిన్ని సడలింపులు కల్పించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సడలించిన కర్ఫ్యూ నిబంధనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్న తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో గురువారం నుంచి కర్ఫ్యూను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ప్రతిఒక్కరు మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2,982 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,14,213కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,11,318గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 616 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 401 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 27 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 12,946కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,461 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,69,417 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 31,850 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.