Coronavirus in AP (Photo Credits: IANS)

Amaravati, October 12:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ దాదాపు అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదవుతూ భయపెట్టిన కేసులు ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కొవిడ్ తీవ్రత నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉంటుంది. అయితే ఇంకా వ్యాక్సిన్ రాలేదు, వైరస్ పూర్తిగా అంతం కాని నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే కేసులు నిలకడగా ఉంటాయి, నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 3,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,58,951కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,56,056 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత గతంలో కంటే తగ్గినప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసులు ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటున్నాయి.  తాజాగా తూర్పు గోదావరి జిల్లా నుంచి  547 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 32 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6256కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,504 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 7,08,712 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 43,983 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  61,112 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  66,30,728 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.