Amaravathi, June 10: కరోనావైరస్ థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇందుకోసం 26,325 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. ఏపిలో ఇప్పటివరకు 1955 బ్లాక్ ఫంగస్ కేసులు మరియు 109 మరణాలను నమోదయినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ సందర్భంగా కోవిడ్ మరియు బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని హైకోర్టుకు వివరించింది. వృద్ధులకు ఆధార్ కార్డు లేకుండానే టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో వృద్ధులకు వ్యాక్సినేషన్ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇక మూడో వేవ్లో పిల్లలకు కరోనా సోకుతుందని ఎక్కడా కచ్చితంగా ధృవీకరింపబడలేదని లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఇప్పటికే చాలావరకు తగ్గుముఖం పట్టింది. రోజురోజుకి కేసులు తగ్గుతూపోతుండగా, అంతకుమించి రికవరీలు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు కూడా తమేణా తగ్గుతున్నాయి.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97,863 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 8,110 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 17,87,883కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 17,84,988గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1416 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 1,042 , అనంతపూర్ జిల్లా నుంచి 906 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 792 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 67 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 11,763కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 12,981 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 16,77,063 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 99,057 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.