COVID19 Outbreak in Andhra Pradesh | Photo: Pixaby/ Twitter

Amaravati, August 15: ఆంధ్రప్రదేశ్‌లో రోజూ వచ్చే పాజిటివ్ కేసుల క్రమాన్ని  బట్టి చూస్తే కొద్దిగా తగ్గినట్లే ఉన్నా, వైరస్ ఉధృతి మాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 8,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,81,817 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2,78,922 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా,  తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1126  కేసులు నమోదయ్యాయి.  అలాగే చిత్తూరు జిల్లా నుంచి 959 కేసులు నమోదయ్యాయి.  ఇక విశాఖపట్నం, కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా కొత్త కేసులు వచ్చాయి.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 87 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 2,562 కు పెరిగింది.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,414 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1,91,117 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 88,138 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  53,712 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా 28,12,197 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.