Coronavirus Outbreak in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, నివారణ కోసం మరిన్ని చర్యలు చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
Coronavirus Outbreak in Andhra Pradesh | PTI Photo

Ongole, March 19: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పాజిటివ్ (COVID 19 Positive) కేసు  నమోదైంది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2కు పెరిగింది. లండన్ నుంచి మార్చి 15న స్వస్థలం చేరుకున్న ప్రకాశం (Prakasam) జిల్లా వాసికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఒంగోలులో ఉన్న రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రికి వెళ్లాడు. అతడి రక్త నమూనాలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపారు, అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో బాధితుడికి ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

అంతకుముందు రెండు వారాల క్రితం క్రితం ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మార్చి 11 నుంచి అతణ్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి

ఏపీలో ఇప్పటివరకు 2 కేసులు పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయాన్ని ధృవీకరిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 109 మందికి పరీక్షలు నిర్వహించగా 94 మందికి నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, మరో 13 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనావ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది. అలాగే విదేశాల నుంచి రాకపోకలు సాగించే ఏపీ విద్యార్థుల, ఎన్నారైల కోసం దిల్లీ మరియు ఏపీలో ప్రత్యేక కంట్రోల్ రూంలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.  ఎలాంటి సహాకారం కోసం అయినా దిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9871999055/9871999059

మరియు ఏపీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 8971170178/8297259070 లను సంప్రదించాలని సూచించింది.