Amaravati, October 1: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గురువారం 7 లక్షల మార్కును దాటాయి. అయితే ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు గతంలో కంటే ఇప్పుడు క్రమంగా తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయం. అంతేకాకుండా ప్రతిరోజు నమోదయ్యే కేసుల సంఖ్య కంటే కూడా ఈ మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం శుభపరిణామం. అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే విషయంలో తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత 24 గంటల్లో 71,577 మంది శాంపుల్స్ పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా మరో 6,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,00,235కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,97,340 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 986 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 753 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు చిత్తూరు నుంచి 888, ప్రకాశం జిల్లా నుంచి 783 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 41 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,869 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,297 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,36,508 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 57,858 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఈరోజు వరకు రాష్ట్రంలో 58,78,135 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.