AP Assembly Session 2021: పేదవాడికి అందుబాటులో వైద్యం, మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మాది, ఆరోగ్య అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్, ఇంకా ఎవరేమన్నారంటే..
AP CM YS Jagan (Photo-Video Grab)

Amaravati, Nov 25: ఆరో రొజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య శ్రీతో పాటు వివిధ అంశాలపై చర్చను నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో (AP Assembly Session 2021) భాగంగా సీఎం జగన్‌ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తెలిపారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో (YSR Aarogyasri Scheme) అనేక మార్పులు చేశామని అన్నారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందింస్తున్నామని చెప్పారు. ఇతర రాష్టాల్లో 130 సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పరిధిలో రూ. 10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 29 నెలలుగా ఆరోగ్యశ్రీపై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ చెప్పారు. 21 రోజుల్లో నెట్‌వర్క్‌ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామని తెలిపారు.

శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు, జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టిన వారు ఏమయ్యారో చూశారుగా, చంద్రబాబు, పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని

వైద్యం ఖర్చు వెయ్య దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్స అందించామని సీఎం పేర్కొన్నారు. గతంతో పోలిస్తే చికిత్పలు రెట్టింపు చేశామని వివరించారు. ఇంకా అవసరమైనవి కూడా కొత్తగా చేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని సీఎం తెలిపారు.

ఆరు బిల్లులకు శాసనమండలి ఆమోదం: ఇక ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ బిల్లు సహా ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రజల వినోదానికి ఇబ్బందులు కలగకూడదనే ఈ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో చర్చించామని తెలిపారు. ఆన్‌లైన్‌ టిక్కెటింగ్ వల్ల ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరన్నారు. బ్లాక్ బ్లస్టర్‌.. వందల కోట్లు వసూళ్లు అంటూ చెప్పుకుంటున్నారు. కానీ జీఎస్టీ మాత్రం రావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా పారదర్శకత కోసమే ఆన్ లైన్ టిక్కెట్ల చట్టం తెస్తున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్‌ చిరంజీవి, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్లుపై స్పందించిన టాలీవుడ్ అగ్రనటుడు

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా: వైఎస్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం మైనార్టీలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభించిందన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. అన్ని వర్గాల కన్నా మైనార్టీలు వెనుకబడి ఉన్నారన్నారు. వైఎస్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు.

రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు దగా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్‌ ఆసరాతో లక్షా 68 వేల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కలిగింది. వైఎస్సార్‌ చేయూత ద్వారా 2.46 లక్షల మంది మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. వక్ఫ్‌ ఆస్తులను కంప్యూటరీకరణ చేయడం జరిగింది. వక్ఫ్‌ బోర్డు బకాయిలు చెల్లించడం జరిగింది. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో 43, 680 మైనార్టీలు ఉన్నారు. ప్రైవేటు కంపెనీ బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం ఆదుకుంది. 20 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి రూ.38 కోట్లు ప్రభుత్వం అందించిందని అంజాద్‌బాషా అన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని:పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో 14వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నాయి. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌తో ప్రజల దగ్గరకే వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు: పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు సేకరించిన భూమి, ఇళ్లులేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాల సంఖ్య చూస్తే ఈ రెండున్నర ఏళ్లలో ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 71 వేల ఎకరాలకుపైగా భూమిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సేకరించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల వద్ద సేకరించిన భూమికి వెంటనే డబ్బులు అందించామని తెలిపారు. అయినా రాజకీయ ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరలో పేదలకు ఇళ్లపట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని అంబటి ఆకాక్షించారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ : ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం అన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీలో 9 బిల్లులు ఆమోదం పొందాయి.