Chandrababu To Davos: నేడు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు... పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో..!
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు నేడు బయల్దేరి వెళుతున్నారు.
Vijayawada, Jan 19: బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) దావోస్ (Davos) లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు నేడు బయల్దేరి వెళుతున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో భాగస్వాములు అవ్వడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను వేదికగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ వివరాలు ఇవిగో
ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దావోస్ బాబు పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. డిల్లీ నుంచి బయల్దేరి తన బృందంతో జ్యూరిచ్ కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్ లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. తరువాత అక్కడి నుంచి హోటల్ హయట్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా' పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. తరువాత అర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్ కు చేరుకుంటారు. రెండవ రోజు సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్ స్పన్, ఎల్ జి, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో రెండో రోజు సమావేశం అవుతారు. మూడవ రోజు కూడా పలు వ్యాపార దిగ్గజాలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 19, 2025 06:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

