YSR Bheema Scheme: ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు సాయం, జులై 1 నుంచి వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, జూలై 8వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభం
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, June 9: వైఎస్ఆర్ బీమా’ పథకంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ బీమా పథకాన్ని (YSR Bheema Scheme) జులై1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు.

ఇక జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా (YSR Bheema Scheme 2021) అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్‌ అన్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీలోనే అత్యధికంగా ప్రాజెక్టులు, గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

ఇక రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటిలోగా పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు, రూ.370 కోట్ల నిధులను జగననన్న తోడు పథకం కింద విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే ఒకరిని గ్రీన్‌ అంబాసిడర్‌గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్‌ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయని, ఆయా కాలనీల్లో ఉపాధిహామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్‌ భారీగా చేపట్టాలని చెప్పారు.

నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ ఏడాది, గత ఏడాది నాటిన మొక్కల్లో 66 శాతం బతికాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, సెర్ఫ్‌ సీఈవో రాజాబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్, ఉపాధిహామీ పథకం డైరెక్టర్‌ చిన్నతాతయ్య, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.