Andhra Pradesh Coronavirus: కర్నూలులో డేంజర్ బెల్స్, ఒక్కరోజే 26 కరోనా కేసులు, ఏపీలో 647కు చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, రెండు వారాల తరువాత  విశాఖజిల్లాలో మరో కరోనా కేసు
Coronavirus Outbreak in Telangana & Andhra Pradesh. Representational Image. | Pixabay Pic

Amaravati, April 20: ఏపీలో కరోనా (AP Coronavirus) విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు (Corona Positive cases)సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు (Kurnool) జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు.

ఇళ్లలోనే పండుగలు, ప్రార్థనలు, మే 7 వరకు ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. ఆదివారం కర్నూలు జిల్లాలో కోవిడ్‌తో (COVID-19) ఒకరు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, చికిత్స అనంతరం కోలుకుని మొత్తం 65 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 565 మంది చికిత్స పొందుతున్నారు.

కర్నూలు జిల్లాను కరోనావైరస్ వణికిస్తోంది. ఆదివారం జిల్లాలో మరో 26 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 156కు చేరింది. కాగా.. ఇప్పటివరకు కర్నూలు నగరంలో మొత్తం కేసులు 80కి చేరాయి. అలాగే నంద్యాల మున్సిపాలిటీలో 25, ఆత్మకూరు ఐదు, నందికొట్కూరు మూడు, డోన్‌ ఒకటి, బేతంచర్ల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల మండలంలో 8, పాణ్యం 7, బనగానపల్లె 5, చాగలమర్రి నాలుగు, కోడుమూరు మూడు, గడివేముల రెండు, శిరివెళ్ల మూడు, కర్నూలు రెండు, ఓర్వకల్లు ఒకటి, నందికొట్కూరు ఒకటి, అవుకు ఒకటి, రుద్రవరం ఒకటి, సంజామల ఒకటి, తుగ్గలి మండలంలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. అలాగే జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలోని గద్వాలకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏపీ సీఎం వైయస్ జగన్‌కు కరోనా టెస్ట్, నెగెటివ్‌గా నిర్ధారణ

రాష్ట్రంలో 24 గంటల్లో 23 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. పశ్చిమ గోదావరిలో 9, వైఎస్సార్‌లో 6, చిత్తూరులో 3, విశాఖలో3, తూర్పు గోదావరిలో 2 చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇదిలా ఉంటే రెండు వారాల తరువాత విశాఖజిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. షీలానగర్‌ ప్రాంతంలో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య అక్కడ 21కి చేరుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి విశాఖలో తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో పాజిటివ్‌ కేసు నమోదుకావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు జిల్లాలో 21 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఆదివారం ఇద్దరు డిశ్చార్జ్‌ అయినవారితో కలిపి మొత్తం 18 మందికి కరోనా నయమైంది. తాజాగా డిశ్చార్జ్‌ అయిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడంతో లాక్‌డౌన్‌ కారణంగా ప్రసుత్తం వారిని అక్కడకు పంపించే అవకాశం లేకపోవడంతో గీతం ఆస్పత్రిలోనే వేరే చోట కార్వంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. షీలానగర్‌ క్వారంటైన్‌లో 60 మంది కరోనా అనుమానితులు ఉన్నారు.

ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే, ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, వారం పది రోజుల్లోనే రోజుకు 17,500 పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు కరోనా పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలిపారు. శనివారం ఒక్కరోజే 5,508 పరీక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై సీఎం ఆదివారం తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.