Telangana Lockdown Extension: ఇళ్లలోనే పండుగలు, ప్రార్థనలు, మే 7 వరకు ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు, ఇంటి యజమానులు 3 నెలలు పాటు అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు, మీడియాతో సీఎం కేసీఆర్
Telangana CM KCR | File Photo.

Hyderabad, April 20: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Telangana Lockdown) మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తెలంగాణలో అలాంటివి ఏవీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.నీలోఫర్ ఆసుపత్రిలో 45 రోజుల పసిబిడ్డకు సోకిన కరోనావైరస్

తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తయ్యేదాకా విమాన ప్రయాణికులెవ్వరూ తెలంగాణకు రావొద్దని సీఎం కేసీఆర్‌ (telangana cm kcr) స్పష్టంచేశారు. ‘మే 4 నుంచి విమాన సర్వీసులు ఉంటాయని ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. నాలుగో తేదీ నుంచి బుకింగ్‌చేస్తామని వార్తలు వస్తున్నాయి. విమాన ప్రయాణికులకు కూడా మనవి చేస్తున్న. దయచేసి మే 7 దాకా తెలంగాణకు రాకండి. వచ్చినా మీకు ట్యాక్సీ, క్యాబ్‌, హోటల్‌ ఏమీ ఉండవు. జీఎమ్మార్‌ వాళ్లకు కూడా చెప్తున్నాం. మే 7 వరకు ఇవన్నీ ఫాలో కావాల్సిందే. ఒక్కసారి తెరిస్తే మళ్లీ మనకు ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు విమానయాత్రికులను రానివ్వబోమని పేర్కొన్నారు.

Here's CM KCR Press Meet

 

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠినంగా లాక్‌డౌన్‌ పొడిగించాలని 95 శాతం మంది కోరుకుంటున్నారు. టీవీ చానెళ్ల సర్వేలోనూ 92 శాతం మంది లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరారు. నేను కూడా లాయర్లు, డాక్టర్లు, రైతులు, కూలీలు, యువత అన్ని వర్గాలకు చెందిన సుమారు వంద మందితో మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరారు. మే 7 వరకు పొడిగిస్తున్నాం. మే 8 నుంచి లాక్‌డౌన్‌ నుంచి బయటపడతామని కేసీఆర్ అన్నారు.

విదేశీ గడ్డపై ఠీవీగా మెరిసిన భారత జెండా

గతంలో మాదిరిగానే పాలు, కూరగాయలు, రాత్రి పూట కర్ఫ్యూ వంటివి యథాతథంగా అమల్లో ఉంటాయి. బియ్యం, నూనె మిల్లులు, శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీల వంటివి పనిచేస్తాయి.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని 1987 నాటి జీవో కింద కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని అన్నారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం ఇళ్ల యజమానులు తమ కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అద్దె వసూలు చేయొద్దు. వీటిని తర్వాత నెలల్లో వడ్డీ లేకుండా వాయిదా పద్ధతిలో అడ్జస్ట్‌ చేసుకోవాలి. ఇది ఇంటి యజమానులకు అప్పీలు కాదు.. ప్రభుత్వ ఆదేశం. చట్టప్రకారం కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్‌ చేయండి. కిరాయిదారులకు అండగా ఉండండి. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల్లో 2019–20కి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపు గడువును అపరాధ రుసుము లేకుండా మే 31 వరకు పొడిగిస్తున్నామని తెలంగాణ సీఎం అన్నారు.

రాష్ట్రంలో 10వేలకు పైగా ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా 2020–21 విద్యా సంవత్సరంలో నయా పైసా ఫీజు పెంచకూడదు. రకరకాల ఫీజులు వసూలు చేయడాన్ని రాష్ట్రంలో అనుమతించం. ట్యూషన్‌ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలి. ఈ కష్ట సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. లేదంటే 100కు డయల్‌ చేయండి. కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాం.

రాష్ట్రంలోని 11 లక్షలకు పైగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తాం. ప్రతి కుటుంబానికి కూరగాయలు, ఇతర అవసరాల కోసం మే మొదటి వారంలోనే రూ.1,500 ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు ఖాతాల్లో వేసిన రూ.1,500 వెనక్కి వెళ్తాయని కొందరు దుర్మార్గులు ప్రచారం చేశారు. ఈ డబ్బు మీద లబ్ధిదారులకే అధికారం ఉంటుందనే విషయాన్ని సర్పంచ్‌లు గ్రామాల్లో ప్రచారం చేయాలి.

కంటైన్మెంట్‌ జోన్లలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరాం. వ్యాధిని పరిధి దాటకుండా నిలువరించడంలో విఫలం కావొద్దు. మే 4 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 7 వరకు తెలంగాణకు రావద్దు. వస్తే ఇక్కడ హోటళ్లు, టాక్సీలు ఏవీ ఉండవు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తాం. నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు లేవు. అయితే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ సప్లయ్‌ సంస్థలు సోమవారం నుంచి సేవలు నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. పిజ్జాల వంటి వాటితో కరోనా వ్యాప్తి చెందుతోంది.

హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ ఎవరైనా నిబంధనలు పాటిస్తూ పండుగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాలన్నీ మూసేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతించం. ప్రజల క్షేమం, భవిష్యత్తు కోసం ఇలాంటి చర్యలు తప్పవు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి సహకారం అందుతోంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 858 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 21 మరణాలు సంభవిస్తే, 186 మంది కోలుకోవడంతో వైద్య పరీక్షల తర్వాత డిశ్చార్జి చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 651 మంది చికిత్స పొందుతుండగా, ప్రాణాపాయ పరిస్థితి ఎవరికీ లేదు. కరోనా మరణాల రేటు.. దేశంలో 3.22 శాతం కాగా, రాష్ట్రంలో 2.44 శాతం అంటే దేశంతో పోలిస్తే మరణాల రేటు మన దగ్గర తక్కువ. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 254 మందికి పరీక్షలు చేస్తే, మనం 375 మందికి చేస్తున్నాం. మొదట్లో వైద్య సిబ్బంది, ఇతరత్రా వైద్య ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కరోనాను నియంత్రించే మందులు కూడా సరిపడా ఉన్నాయి. ప్రయోగశాలలు, టెస్టింగ్‌ కిట్లకు ఇబ్బంది లేదు. మిగతా ఆరోగ్య సేవలు నిలిపేయకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.

లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించడంతోపాటు ఏప్రిల్‌లో పెన్షనర్లకు 75 శాతం సొమ్ము చెల్లించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యోగ జేఏసీ, పెన్షనర్ల సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.జెన్‌కో, ట్రాన్స్‌కో, ఇతర డిస్ట్రిబ్యూటర్లు కలిపి విద్యుత్‌ విభాగంలో పనిచేస్తున్నవారికి గతంలో 50 శాతం వేతనాలు చెల్లించాం. ఏప్రిల్‌లో 100 శాతం వేతనం చెల్లించాలని క్యాబినెట్‌లో నిర్ణయించాం. వారిసేవలు అత్యవసరం కాబట్టి 100 శాతం వేతనం ఇస్తాం. వారికి ఇబ్బందులు తొలుగుతాయి’ అని సీఎం వివరించారు.