
Amaravati, Dec 12: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా, 510 మందికి పాజిటివ్గా నిర్థారణ (AP Covid Report) అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,75,025కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని 665 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,62,895 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు ఏపీలో 7052 మంది (Covid Deaths) మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,07,67,117 పరీక్షలు నిర్వహించారు.
కరోనా మహమ్మారి నివారణకు సంబంధించి సీరం కీలక అంశాన్ని వెల్లడించింది. ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని సీరం సీఈఓ అదార్ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, వచ్చే నెలలోగా భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి, ఆ తరువాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభమవుతుందన్నారు. అలాగే 2021, అక్టోబర్ నాటికి చాలామందికి టీకాలు వేయడం పూర్తవు తుందని, దీంతో మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ఆ తర్వాత ప్రజలంతా సాధారణ జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ల తయారీకి సీరం నోవావాక్స్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నోవావాక్స్ కోసం ఫేజ్ 3 క్లినికల్ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.