AP PRC Issue: పీఆర్సీపై కొనసాగుతున్న రగడ, ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్న ఉద్యోగ సంఘాలు, ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని మండిపడిన మంత్రి పేర్నినాని
AP PRC (Photo-Video grab)

Amaravati, Jan 20: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్‌‌లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై ( AP PRC Issue) జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.

పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాలు నేతలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాయి. ప్రభుత్వం (Andhra Pradesh government) దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ తగ్గించడం, హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. పీఆర్‌సికి (PRC orders) సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీఓలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఏపీలో గత 24 గంటల్లో 12,615 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,338 కేసులు నమోదు, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు

ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. యూనియన్‌ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 23 శాతం ఫిట్మెంట్‌ను కాంట్రాక్టర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామన్నారు. ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమలేకనే చేస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు. ఐఆర్‌ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు