AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీపై అప్‌డేట్, ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం
Exams Results

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు (AP Inter Results 2024) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి.

ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి దాదాపు 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి మొత్తం 10 లక్షలకుపైగా మంది పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్‌ మొదటి ఏడాది 5,17,617 మంది, ఇంటర్‌ రెండో ఏడాది 5,35,056 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరిలో మొత్తం 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 75 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌కు యత్నించగా.. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..పాల్గొంటున్న 21 లక్షల మంది పాఠశాల విద్యార్థులు

వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఆదివారమే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇకవేళ ఎల్లుండి కాకుంటే ఈ నెల 15వ తేదీ నాటికి ఇంటర్‌ ఫలితాలు వెలువరించేందుకు ఇంటర్ బోర్డ్‌ సన్నాహాలు చేస్తోంది.

ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల కానున్నాయి. అదే సమయంలో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అప్ లోడ్ చేస్తారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్ధులు స్కోరు కార్డును యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి అభ్యర్ధులు ఫలితాలు విడుదల కాగానే బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.