Amaravati, November 13: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. వారాంతం వచ్చే సరికి కొత్త కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా రావడంతో ఆక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వందకు తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన వైరస్ నిర్ధారణ పరీక్షలు 90 వేల మార్కును దాటింది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,737 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 1,593 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,51,298కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,48,403గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 259, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 188 కేసులు రాగా, చిత్తూరు నుంచి 225, కృష్ణా జిల్లా నుంచి 202, మరియు గుంటూరు జిల్లా నుంచి 202 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 10 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6847కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2178 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,24,189 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 20,262 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.