TS-AP Bus Operations: తెలంగాణ-ఏపీ మధ్య బస్సు సర్వీసులకు లైన్ క్లియర్, 322 బస్సులను తగ్గించుకునేందుకు సిద్ధమైన ఏపీఎస్ఆర్టీసీ, రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం
APSRTC Buses. (Photo Credit: PTI)

Amaravati, Oct 12: తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో (Interstate bus services) ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను (TS-AP Bus Operations) తగ్గించనుంది. లాక్‌డౌన్‌ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

అయితే తెలంగాణ ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించగా ఏపీ మాత్రం వచ్చే ఏడాది మార్చి వరకే సిద్ధమంది. ఒప్పందంపై చర్చలకు ఈ దఫా టీఎస్‌ఆర్టీసీ (Telangana RTC) అధికారుల్ని విజయవాడకు రావాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీ ఆహ్వానించింది. ఈ అంశంపై సోమ లేదా మంగళవారాల్లో స్పష్టత రానుంది. తెలంగాణ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్ని, కి.మీ.లను తగ్గించి ప్రతిపాదనలు రూపొందించింది.

కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీకి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం, భారీ ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు వదిలేయాలని కృష్ణ బేసిన్‌లోని పలు జలాశయాలకు సిడబ్ల్యుసి సూచన

కాగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు మొదట్నుంచీ హైదరాబాద్‌–విజయవాడ రూట్లోనే బస్సులు పెంచుకుంటామని చెబుతున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీని తగ్గించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే 85 బస్సుల్ని తగ్గించింది. విజయవాడ రూట్లోనే టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు పెంచుకోనుంది. టీఎస్‌ఆర్టీసీకి హైదరాబాద్‌–బెంగళూరు లాభదాయకమైన రూట్‌. రోజూ 70 సర్వీసుల వరకు బెంగళూరుకు తిప్పుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి బస్సుల్ని తిప్పడం లేదు. ఎందుకంటే బెంగళూరుకు వెళ్లాలంటే ఏపీ నుంచే వెళ్లాలి. దీంతో ఇప్పుడు బస్టాండ్లలోకి రాకుండా బెంగళూరుకు బస్సుల్ని తిప్పుకుంటామని టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. దీనిపై ఏపీఎస్‌ఆర్టీసీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.