Coronavirus Outbreak in AP | PTI Photo

Amaravathi, June 14:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 6,152 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,841 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 15,633 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నూలు నుంచి ఒకరు తూర్పుగోదావరి జిల్లా నుంచి మరొకరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 84 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 82 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2723 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2034 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

 

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఏపీకి వస్తున్న వారిలో కరోనా బాధితులుంటే వీరి సంఖ్యను అధికారులు విడిగా చూపుతున్నారు.  గత 24 గంటల్లో నమోదైన మొత్తం 294 కేసుల్లో 253 ఏపి పరిధిలోనివి కాగా, మిగిలిన 41 కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1107 మందికి వైరస్ నిర్ధారణ కాగా, ప్రస్తుతం వీరిలో 537 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 204 మందికి పాజిటివ్ అని తేలగా, ప్రస్తుతం 181 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.