
Amaravati, July 29: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను (TDP leader Atchannaidu Bail Petition) హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్తో పాటు మిగిలినవారి బెయిల్ పిటిషన్లను కోర్టు (AP High Court Rejects) కొట్టివేసింది. కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు (Atchannaidu) అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ
తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయిన ఏ1 రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల 12న అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ ముందు జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. రూ.150 కోట్ల ఈఎస్ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్
గతంలో కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. కాగా గత ఆరేళ్లలో ఈఎస్ఐలో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దాంతో ఈ కేసును ఏసీబీ బదిలీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం అందరికి తెలిసిందే.
ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో గుర్తించారు. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్లో అధికారులు ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రభుత్వం కక్షపూరితంగా ఇరికించిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.