SSC Paper Leak Case: రెండు దెబ్బలు కొడితే నారాయణకు ఏమైనా జరగవచ్చు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని వెల్లడి
YSRCP Rebal MP K Raghu Ramakrishna Raju (Photo-ANI)

Amaravati, May 10: నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో (SSC Paper Leak Case) అరెస్ట్ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజికి కారణమని సీఎం జగన్ అన్నారని, కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? అని రఘురామ (Raghuram Krishnaraju Reaction) ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నారాయణను అరెస్ట్ (Narayana arrested) చేయడం సరికాదని స్పష్టం చేశారు.

అయితే వీరికొక అలవాటుందని, విచారణ చేపట్టే గదుల్లో కెమెరాలు తీసేస్తారని, వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారని రఘురామ వెల్లడించారు. కొట్టడం కోసమే ఆ విధంగా చేస్తారని, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఇవన్నీ తన కేసులోనూ జరిగాయని, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు.

కాగా, నారాయణ శారీరక దారుఢ్యం ఏ మేరకు ఉందో తెలియదు కానీ, రెండు మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చని తెలిపారు. నారాయణ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే కోర్టును ఆశ్రయించడం మంచిదని, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకైనా తెగించే రకం అని రఘురామ స్పష్టం చేశారు.ప్రభుత్వ అన్యాయాల్ని నిలదీయడానికి ప్రజలు క్రమంగా బయటికొస్తున్నారని, ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేస్తే వాళ్లందరూ భయపడతారని భావిస్తున్నారని వివరించారు.

నారాయణ అరెస్ట్‌, లీక్‌ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లేనని తెలిపిన అంబటి రాంబాబు, నారాయణ అరెస్ట్‌లో కక్ష సాధింపు ఏముందని ప్రశ్నించిన రాంచంద్రారెడ్డి, ఇంకా ఎవరేమన్నారంటే..

ఈ కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటే, సీఎం జగన్ ను, బొత్సను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యవాదులు నారాయణ అరెస్ట్ ను ఖండించాలని తెలిపారు.