Paper Leak Case: ట్విస్టులతో సాగుతున్న నారాయణ అరెస్ట్ ఎపిసోడ్, అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో మరో కేసు నమోదు, భగ్గుమంటున్న టీడీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.
Hyd, May 10: టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు అదుపులోకి (TDP Leader P Narayana arrested ) తీసుకున్నారు. ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం (Exams Paper Leak Case) వెనుక నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ చేసింది నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే అంటూ సీఎం జగన్ నేరుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు, దీనికి సంబంధించి చిత్తూరులో నారాయణపై కేసు నమోదయింది.
మాజీ మంత్రి నారాయణపై (Former Andhra Pradesh minister) మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు అయ్యింది. దీనిపై సోమవారం(మే9వ తేదీన) ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో మంగళగిరి పీఎస్లో కేసు నమోదు చేయగా, దీనిపై ఏపీ సీఐడీ (AP CID) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మాస్టర్ ప్లాన్లో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారనే ఫిర్యాదుపై చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్లపై కేసు నమోదు చేశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంపై (CID Arrest Former Andhra Minister Narayana) చిత్తూరు పోలీసులు స్పందించారు. నారాయణను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని తెలిపిన పోలీసులు... హైదరాబాద్లో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు. అనంతరం ఆయనను చిత్తూరు తరలిస్తున్నామని కూడా తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపై నమోదు చేసిన కేసుల వివరాలను కూడా చిత్తూరు పోలీసులు వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చట్టం కింద, ఐపీసీ సెక్షన్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక పబ్లిక్ ఎగ్జామ్ చట్టంలోని సెక్షన్లు 5, 8, 10 కింద కూడా నారాయణపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రానికి చిత్తూరు తరలించనున్న నారాయణను అక్కడి జ్యూడీషియల్ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
ఈ అరెస్ట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ అరెస్ట్ చేయించారని విమర్శించారు. ఈ మూడేళ్లలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్ట్ లు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని అన్నారు. ఒక మాజీ మంత్రికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దీన్ని తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని ఉమ మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీసీ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందని విమర్శించారు. 'మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు జగన్' అంటూ ఉమ స్పష్టం చేశారు.
పొంగూరు నారాయణను అరెస్ట్ చేసిన జగన్ సర్కారు తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తమ చేతగాని తనాన్ని ఇతరులపైకి నెట్టేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం వరుస ట్వీట్లలో జగన్ సర్కారు తీరును తప్పుబట్టారు. ఈ ట్వీట్లతో పాటు నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారన్న విషయాన్ని తెలుపుతూ లోకేశ్ ఓ ఫొటో కూడా పోస్ట్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్ట్పై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. నారాయణ అరెస్ట్ ముమ్మాటికీ కక్షసాధింపేనని చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో (10th Exams Paper Leak Case) ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించిన చంద్రబాబు... ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అంటే కక్షపూరిత చర్య కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
నారాయణ అరెస్ట్ పై ప్రభుత్వం కారణం చెప్పే పరిస్థితి లేదని ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గంటగంటకు ఎఫ్ఐఆర్ మార్చుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణ విద్యాసంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థల ద్వారా బోధన జరుగుతోందని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మందికి పైగా ఉద్యోగులతో నడుస్తున్న విద్యాసంస్థలు అని వివరించారు. విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజిపై విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు వైసీపీ ఇకనైనా స్వస్తి పలికాలని హితవు పలికారు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆ పాపాన్ని నారాయణపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ అరెస్ట్ వెనుక సీఎం జగన్ కుట్ర ఉందని అన్నారు. అక్రమ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని చెప్పారు. తనపైనా, కళా వెంకట్రావుపైనా కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో 150కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. జగన్ ప్రజాహితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పని చేస్తున్నారని అన్నారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నాప్రత్రాల లీకేజీనే జరగలేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.
(The above story first appeared on LatestLY on May 10, 2022 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

