Vizag Steel Plant Privatization Row: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణ ప్రక్రియలో మరో ముందడుగు? ప్రైవేటీకరణ సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీని నియమించిన కేంద్రం, ఆందోళనలు లెక్కచేయకుండా పనులు మరింత వేగవంతం!
File Image of Vizag Steel Plant (Photo-Twitter)

New Delhi/ Vishakhapatnam, February 25: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పలు మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఇద్దరు ముఖ్యులు కూడా ఉన్నారు. పెట్టుబడి ఉపసంహరణ విభాగం నుండి సాంకేతిక సహాయం తీసుకోవడంతో పాటు, ప్రైవేటీకరణకు సంబంధించిన విధానాలపై కేంద్రం ఒక రూపకల్పనను సిద్ధం చేస్తోంది. ఈ కమిటీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపుతుంది. తదనుగుణంగా కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయనుంది.

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కార్మికులు మరియు ప్రజా సంఘాలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చాయి. ప్రైవేటీకరణ పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క వ్యూహాత్మక అమ్మకాన్ని నిలువరించేందుకు ఐక్య పోరాటం చేయాలని ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉక్కు కార్మాగారంపై కేంద్రం యొక్క నిర్ణయాన్ని రాష్ట్రంలో "అతిపెద్ద భూ కుంభకోణం" గా ఏపీ కాంగ్రెస్ అభివర్ణించింది.

అయినప్పటికీ కేంద్రం తన నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నప్పటికీ, ప్రైవేటీకరణ పనులను కేంద్రం మరింత వేగవంతం చేసింది.

ప్రైవేటీకరణ సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీని నియమించింది.