AP Fibernet Case: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, సెక్షన్ 17-ఎ కేసులో ఇంకా వెలువడని తీర్పు, టీడీపీ అధినేత కేసు అప్డేట్స్ ఇవే
ఏపీ ఫైబర్నెట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
Vjy, Nov 9: ఏపీ ఫైబర్నెట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గురువారం జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పటిషన్ విచారించనుంది. 11వ నెంబర్ ఐటెంగా కేసు లిస్ట్ అయింది.
తన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. ఈ కేసు అక్టోబరు 13, 17, 20వ తేదీల్లో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ దీనికంటే ముందే విచారణలో ఉండటంతో ఆ కేసులో తీర్పు వెలువరించాక.. దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పి గత నెల 20న ముందస్తు బెయిల్ కేసు విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది.
17-ఎ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం కానీ, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని ధర్మాసనం ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ధర్మాసనం గతంలో చెప్పినట్లు 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పు వెలువరించలేదు. గురువారంనాటి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. అందువల్ల గురువారం ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెలువరిస్తారా? లేదంటే 17-ఎ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఫైబర్నెట్ కేసులో నిందితులు వి.హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను జప్తు చేయాలనే అభ్యర్థనతో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రూ.114 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలనే అభ్యర్థనతో సీఐడీ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. న్యాయాధికారి హిమబిందు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
(The above story first appeared on LatestLY on Nov 09, 2023 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

