
Amaravati, July 4: ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించిన సంగతి విదితమే. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రధాని పర్యటన (PM Modi AP Visit) ముగిసిన అనంతరం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. అదే సమయంలో ప్రధానికి సీఎం విజ్ఞాపన పత్రం (CM YS Jagan Give Letter to PM Modi) అందించారు.
విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని (special status for Andhra Pradesh) లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని లేఖలో కోరారు.తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరుచేయాలి. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.