Amaravati, October 2: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసులు 7 లక్షలకు పైగానే ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 50 వేలలోనే ఉంది. అయితే ప్రతినెలా లాక్డౌన్ సడలింపులు పెంచుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత సెప్టెంబర్ నెలలోనే దేశవ్యాప్తంగా 25 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఇండియా 26,21,418 పాజిటివ్ కేసులను నమోదు చేసింది.
గత 24 గంటల్లో ఏపిలో నమోదైన కేసుల విషయానికి వస్తే 70,399 మంది శాంపుల్స్ పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా మరో 6,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,06,790కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,03,895 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 975 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 930 పాజిటివ్ కేసులు, అలాగే చిత్తూరు నుంచి 925 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 31 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,900 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,485 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,43,993 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 56,897 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.