Pattabhi Shifted to Rajahmundry Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి, 14 రోజుల రిమాండ్ విధించిన మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు, బెయిల్‌పై ఉన్నా ఆంక్షలు పాటించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదనలు
Kommareddy Pattabhiram (Photo-Video Grab)

Amaravati, Oct 22: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు (DP Leader Pattabhi Arrested) చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పట్టాభిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు (Pattabhi Shifted to Rajahmundry Jail) తరలించారు. కాగా, పట్టాభిని గత బుధవారం రాత్రి సూర్యారావుపేట పోలీసులు విజయవాడలో అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీసు స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత గురువారం ఉదయం తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌ నుంచి మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్‌ 2 వ తేదివరకు రిమాండ్‌ విధించారు.

కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ.. పట్టాభి (TDP Spokesperson kommareddy pattabhi) తరచూ నేరాలకు పాల్పడుతున్నాడని ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆయన ఇతర కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడని పేర్కొన్నారు. అయితే బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడంలేదని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, దీని వెనుక రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించాలన్నదే పట్టాభి లక్ష్యమని తెలుపుతూ. న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను ఆయన ఖాతరు చేయడం లేదని, కేవలం స్వప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు.

వీటిని పరిగణనలోకి తీసుకుని పట్టాభికి బెయిల్‌ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడమే సరైన చర్యని కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నవించారు. విచారణ జరిపిన కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో అతనిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదైంది.