
Amaravati, October 13: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి, ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైరస్ ఇంకా తొలగిపోలేదని ప్రజలను హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఏపీలో కూడా కొవిడ్ తీప్రత ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి, అయితే నిన్నటి కంటే ఈరోజు సుమారు వెయ్యి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 4,622 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,63,573కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,60,678 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత గతంలో కంటే తగ్గినప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసులు ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటున్నాయి. గడిచిన ఒక్కరోజులో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 752 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి నుంచి 691 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు నుంచి కూడా ఎక్కువగా 705 కేసులు అలాగే ప్రకాశం మరియు కృష్ణా జిల్లాల నుంచి 400కు పైగా కేసులు నమోదు చేయబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 42 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6,291 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,715 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,14,427 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 42,855 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.