
Amaravathi, Febuary 28: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) ప్రజలకు చేరువ అయ్యేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు.
ఇందులో భాగంగా వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను (YSR Village Clinic) ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ (AP CM) అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఉద్యోగాలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం
గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. అందులో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు స్టాఫ్గా అందుబాటులో ఉండాలని చెప్పారు.
విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోగులకు రూపాయి లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులతో అన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 బోధనాసుపత్రులు ఉంటే ప్రజలకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నామని, ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాలన్నారు.
విద్యార్థుల కోసం మరో ప్రతిష్ఠాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం
ప్రస్తుతం రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయని, మరో 7 వైద్య కళాశాలలకు డీపీఆర్లు సిద్ధమవుతున్నాయని ఈ సందర్భంగా సీఎంకు ఆ శాఖ అధికారులు వివరించారు. బోధనాసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు, నర్సుల కొరతను అధిగమించాలని సీఎం సూచించారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ‘డా.వైఎస్సార్ చిరునవ్వు’ (YSR Chirunavvu) ద్వారా ఉచితంగా దంత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు జరగాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు.
ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు దీనిపై అధ్యయనం చేయాలని, ప్రస్తుతం కంటి వెలుగు (YSR Kanti Velugu) కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలించాలన్నారు. జూలై 8న ‘డా.వైఎస్సార్ చిరునవ్వు’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.