Weather Update: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, జలమయమైన రోడ్లు, రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి
Rainfall near Pragathi Bhavan, TS CMO, Hyderabad. | Photo: Twitter

Hyderabad, May 16: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శనివారం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్ నగర్, కొండాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్,  పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్. ఆర్ ‌నగర్‌, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, కార్వాన్‌, టోలిచౌకి, దర్గా, గోల్కొండ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తార్నాక, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో కూడా 3సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.

భారీగా వీచిన ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. రోడ్లపైకి నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహన చోదకుకులు అవస్థలు పడ్డారు. అయితే లాక్డౌన్ కారణంగా రోడ్లపై వాహానాలు ఎక్కువగా తిరగకపోవడంతో ట్రాఫిక్ జాంలో భారీ నిరీక్షణలు తప్పాయి. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఈ వర్షం చల్లని రిలీఫ్‌నిచ్చింది.

ANI Update:

ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.  ఒడిశాలోని పారాదీప్‌కు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్తా 'అంఫాన్' తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని కారణంగా రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.