Ambulance At SLBC Tunnel (Credits: X)

Hyderabad, Mar 1: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్‌ దవాఖాన (Hospital) వద్దకు 8 అంబులెన్సులు చేరుకోవడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత శనివారం ఉదయం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎనిమిది మంది జాడ తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌’ (జీపీఆర్‌) పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీపీఆర్‌ ద్వారా జీరో పాయింట్‌ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కానింగ్‌ చేశారు. ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు ఐదు స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోసారి క్రాస్‌ చెక్‌ చేసుకున్న బృందం ఇది నిజమేనన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే వారంతా ప్రాణాలతో ఉన్నారా అనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి దిబ్బదలు, బురదలో చిక్కున్న వారు ఇన్ని రోజులు ఊపిరితో ఉండగలరా అనే అనుమానం నెలకొన్నది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో కీలక పురోగతి, రాడార్‌ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్‌ చేస్తుండగా ఐదుచోట్ల మెత్తని భాగాలు

8 అంబులెన్సులు రావడంతో

ఇదే సమయంలో శనివారం ఉదయం నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ దవాఖానకు 8 అంబులెన్సులు చేరుకున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మరణించిన కార్మికుల మృతదేహాలను ఏ క్షణంలోనైనా నాగర్‌ కర్నూల్‌ కు తరలించే అవకాశం ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో టన్నెల్ లో చిక్కుకున్న కార్నికుల కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచరులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఎనిమిది ప్రభుత్వ,  ప్రైవేట్ అంబులెన్సులను హైదరాబాద్‌ నుంచి రప్పించినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. వైద్య సిబ్బంది లేకుండా కేవలం పైలెట్ తో కూడిన అంబులెన్సులు రావడంతో కార్మికులు మృత్యువాత పడ్డారనేది నిర్ధారణ అయినట్టు కొందరు చెప్తున్నారు. ఒక్కో అంబులెన్సు డ్రైవర్‌ కు తాము చెప్పిన స్టేట్ కు వెళ్లాల్సి ఉంటుందని ముందుగానే సమాచారం ఇచ్చినట్టు అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ