CM Revanth Reddy Review on Power Utilities: విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష, నన్ను ఎవరూ పిలవలేదని తెలిపిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం

విద్యుత్‌ రంగంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy Review on Power Utilities: విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష, నన్ను ఎవరూ పిలవలేదని తెలిపిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం
CM Revanth Reddy Review on Power Utilities (photo-X)

Hyd, Dec 8: విద్యుత్‌ రంగంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల స్థితిగతులు, డిమాండ్‌, కొనుగోళ్లు, బకాయిలు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. విద్యుత్‌ రంగంపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం రెండు గ్యారంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయం, రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులతో సమావేశం కానున్నారు.

ప్రజా దర్బార్‌ వీడియోలు ఇవిగో, సమస్యలు విన్నవించుకునేందుకు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివచ్చిన ప్రజలు, వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్‌ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Here's Video

విద్యుత్‌ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్‌ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మీ సహాకారం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి

అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఇటీవల ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖపై సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని.. సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు స్పందిస్తూ సీఎంవో నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

కాగా సీఎం రేవంత్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్‌ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌ జరగనుంది. అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

(The above story first appeared on LatestLY on Dec 08, 2023 02:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).