Colonel Santosh Babu: సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి
Colonel Santosh Babu | File Image | (Photo Credits: Twitter)

New Delhi, June 16: భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు (Colonel Santosh Babu) ఉన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. సరిహద్దుల్లో దాడులతో బరితెగించిన చైనా, భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతి, కొనసాగుతున్న రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు

కాగా లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనా బలగాలు (India-China Face-Off) మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో (Indian Army Officer) పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

Here's Pray Tweets

సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మూడు నెలల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్

తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేగాకుండా, సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతోపాటు, ఆయన అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పాల్గొనాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.

భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయుల రక్షణ కోసం కుమారుడిని సైన్యంలోకి పంపిన సంతోష్‌ తల్లిదండ్రులకు యావత్‌ దేశం రుణపడి ఉంటుందన్నారు. కాగా సంతోష్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సుఖేందర్‌ రెడ్డి పరామర్శించారు.

Here's AP governor Tweet 

అటు సంతోష్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతోష్ తెగువ, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్ చేశారు.

Here's KTR Tweet

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు వీర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమరులైన తెలంగాణలోని.. సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సంతోష్‌ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృథా కావని నివాళులు అర్పించారు.

సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ‘నా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం తల్లిగా బాధగా ఉంది. కానీ దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషంగా ఉంది’ అని మంజుల పేర్కొనడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.