Telangana: తెలంగాణలో 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1410 పాజిటివ్ కేసులు నమోదు, 331కి పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

Hyderabad, July 9: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 30 వేలు దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 30,946కి చేరుకుంది.

ఎప్పట్లాగే హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన మొత్తం కేసుల్లో 918 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

హైదరాబాద్ సమీపాన ఉండే మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈరోజు రంగారెడ్డి నుంచి 125 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 67 కేసులు వచ్చాయి. మరోపక్క సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఈరోజు 79 కేసులు నమోదవడం గమనార్హం. తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు, ఫెయిల్ అయిన వారందరూ పాస్‌గా ప్రకటన 

గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

 

మరోవైపు  గత 24 గంటల్లో మరో 7  కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 331 కు పెరిగింది.

అలాగే,  గురువారం సాయంత్రం నాటికి మరో  913 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 18,192  మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో  12,423 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది

గత 24 గంటల్లో 5,954 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,40,755 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.