Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుఫాన్, తెలంగాణలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా, అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపిన సైక్లోన్ గులాబ్
గులాబ్ తుపాను ఎఫెక్ట్తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad MD) అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Hyd, Sep 28: గులాబ్ తుపాను ఎఫెక్ట్తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad MD) అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం తుపాను (Cyclone Gulab) ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇకపోతే.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు.
దీని ప్రభాంతోనూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే.. ‘గులాబ్’ తుపాను కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి సీజన్లో అత్యధికంగా 95.70 సెంటీమీటర్ల వర్షపాతు నమోదైందని అధికారులు వెల్లడించారు.
ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. ఒకవేళ వెళ్లినా.. ప్రతీ జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలని సూచించారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో.. పోలీసులు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేశారు. మూడు రోజుల పాటు సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు శాసనసభ, శాసనమండలి కార్యాలయాలు ప్రకటించాయి.
భారీ వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని బులెటిన్లో అసెంబ్లీ కార్యాలయం సూచించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు.. అనగా 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవని వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో గులాబ్ తుఫాన్ ప్రభావం
గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో చెదురు ముదురు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గులాబ్ తుఫాన్ పశ్చిమ దిశగా పయనిస్తూ.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంవల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని, తర్వాత తుఫాన్ క్రమంగా కదులుతూ అరేబియా సముద్రంలో కేంద్రీకృతమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వర్షాలు పడతాయని నిపుణులు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Sep 28, 2021 12:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

