![](https://test1.latestly.com/uploads/images/2025/02/38-196.jpg?width=380&height=214)
Secunderabad, FEB 13: ఫ్లైఓవర్ల పుణ్యమా అని హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. పదేళ్ల కిత్రం ఎల్బీనగర్ వచ్చిన వాళ్లు.. ప్రస్తుతం ఉన్న ఎల్బీనగర్ సర్కిల్ చూస్తే గుర్తుపట్టడం కష్టమే. అలాగే.. సికింద్రాబాద్ అంటే గుర్తుకు వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) భవన నమూనా. స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా పాత భవనం కనుమరుగు కానుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను నేలమట్టం చేస్తున్నారు.
సికింద్రాబాద్లో ఇప్పటికే ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశలవారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. సుమారు రూ.700కోట్ల అంచనాతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో ప్రయాణీకులకు మెరుగైన సేవలు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.