
Hyderabad, Feb 28: ఆర్టీసీ బస్సులో (RTC Bus) ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవర్ (Driver) వద్దగానీ, కండక్టర్ వద్దగానీ చిల్లర మర్చిపోయారా? అదేనండీ.. టికెట్ కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తూ ఉంటాంగా. టికెట్ ఇచ్చే డ్రైవర్ గానీ, కండక్టర్ గానీ టికెట్ డబ్బులు పోనూ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడు తీసుకోవాలని చెప్తారుగా. అలా బస్సు దిగేప్పుడు మీరు చిల్లర డబ్బులు తీసుకోవడం మర్చిపోతారుగా. మరి ఆ చిల్లర డబ్బులు కావాలి అంటే.. ప్రస్తుతం డిపోకు వెళ్తే చిల్లర డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. అయితే, చిల్లర కోసం శ్రమకోర్చి అంతదూరం ఏం వెళ్తాంలే అని చాలామంది వదిలేస్తారు. ఇకపై చిల్లర మర్చిపోయినా చింతించాల్సిన పనిలేదని ఆర్టీసీ తెలిపింది. 040-69440000 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి వివరాలు చెప్తే, రావాల్సిన చిల్లరను ఫోన్ పే ద్వారా పంపిస్తామని వెల్లడించింది. బస్సులో ఏవైనా వస్తువులు మర్చిపోతే ఈ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టంచేసింది. టికెట్ పై కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత
ఈ సౌకర్యం కూడా..
దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు, లేదా టాయిలెట్ కోసం దిగి కొందరు బస్ మిస్సవుతుంటారు. అలాంటి సమయంలో టికెట్ పై ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే.. అదే టికెట్ తో మరో బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని టీజీఆర్టీసీ ప్రకటించింది.