TS's COVID19 Update: కరోనావైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య నిపుణుల సూచన, తెలంగాణలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus Outbreak | PTI Photo

Hyderabad, February 22: దేశవ్యాప్తంగా కోవిడ్19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మళ్లీ విస్తరించకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలకు సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో పాటు వైరస్ యొక్క కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రజలు కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 14,744 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 114 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 259 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,97,712కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 8, రంగారెడ్డి నుంచి 12, మరియు సంగారెడ్డి  నుంచి 9 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,625కు పెరిగింది. ఆదివారం సాయంత్రం వరకు మరో 143 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,94,386 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1701 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక రాష్ట్రంలో రెండు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ తిరిగి చేపట్టనున్నారు. తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు టీకా పంపిణీ, అలాగే ఇప్పటివరకు టీకా వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.