Hyderabad Shocker: బోయిన్పల్లిలో దారుణం, ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య, అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవానీనగర్ కాలనీకి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ కలహాలతోనే వీరు ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Balanagar, Oct 13: సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవానీనగర్ కాలనీకి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ కలహాలతోనే వీరు ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్పల్లికి చెందిన శ్రీకాంత్ చారి (42)కి భూదాన్ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది.
వీరికి స్రవంతి (8), శ్రావ్య (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ సిల్వర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి గురువారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. ఉదయం లేచి చూస్తే పిల్లలతో సహా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది గమనించిన భార్య అక్షయ.. కింది అంతస్తులో ఉంటున్న తన అత్త జయమ్మకు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.. శ్రీకాంత్ నిద్రించిన ఇంట్లో ఆధారాలు సేకరించింది. సైనైడ్ తీసుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించింది. మరోవైపు ప్రాథమికంగా అక్షయను ప్రశ్నించిన పోలీసులు.. మరింత లోతుగా ఆమెను విచారించే అవకాశం ఉంది. ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 13, 2023 11:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

