
Kamareddy, FEB 21: కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి (Daughter Marriage) జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం (58) కూతురికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. శుక్రవారం నాడు బీటీఎస్ చౌరస్తా సమీపంలోని ఫంక్షన్ హాలులో పెళ్లి జరగాల్సి ఉంది.
కానీ పెళ్లి తంతు జరుగుతుండగానే తీవ్ర విషాదం నెలకొంది. వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న సమయంలో బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారుపడిన బంధువులు బాలచంద్రంను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే ఆయన కన్నుమూశాడు. కూతురు పెళ్లి చూడకుండానే బాలచంద్రం మరణించడం అందర్నీ కంటతడి పెట్టించింది. ఇక ఇవాళే ఆ తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. కూతురి పెళ్లి చూడటానికి వచ్చిన వారంతా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందర్నీ కలిచివేసింది.