Heavy Rain Floods: మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
Heavy Rains To Hit Telugu States in Next 2 Days (Photo-Twitter)

Hyderabad. August 17: తెలుగు రాష్ట్రాలను వరదలు (Heavy Rain Floods) ముంచెత్తాయి. రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rians Hits Telugu States) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం దశ, దిశ ఇప్పటివరకు తెలియకపోవటంతో... ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో తెలియడం లేదు.

రాగల 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసుకొని అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ‌ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ - 08912590102.. విశాఖ ఆర్డీఓ కార్యాలయం- 8790310433.. పాడేరు - 08935250228, 8333817955, 9494670039.. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ - 8247899530, 7675977897. పెళ్లికొడుకుకి కరోనా, 500 మందిలో మొదలైన టెన్సన్, ఏపీలో తాజాగా 8,012 కేసులు, గత 24 గంటల్లో 10,117 మంది డిశ్చార్జ్‌, 2,89,829కి చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారి కన్నబాబు తెలిపారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరికాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 17,18 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 939 క్యూసెక్కులుంది. సహాయక చర్యల్లో అధికారులు, ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని కన్నబాబు కోరారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వదర ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 1లక్ష 45వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1లక్ష 30 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజి ఎగువభాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు,విప్ల వాగు, కీసరలో వరద ఉధృతి తగ్గుతోంది.

నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,28,632 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కులను వదిలి, మిగులుగా ఉన్న 15,23,132 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.

తెలంగాణను ముంచెత్తిన వరదలు

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలతో పాటు ప్రధాన నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల ఎగువ రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా ప్రవాహాలు పోటెత్తు తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండగా, ఆల్మట్టి, నారాయణ పూర్‌కు భారీగా వరద పెరిగింది. ఇక్కడకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవా హాలు పుంజుకున్నాయి. ప్రాణహిత మహో గ్రరూపం దాల్చుతోంది.

హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పైనుంచి వరదనీరు వచ్చిచేరడంతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. దీంతో ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం 513 అడుగులకు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా ఉన్న మారియెట్‌ హోటల్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నీరు దిగువకు గతంలో కంటే అధికంగా హుస్సేన్‌సాగర్‌ నాలాకు వచ్చిచేరుతోంది. దీంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. సోమవారం కూడా ఇలాగే వర్షం కురిస్తే ప్రవాహ ఉధృతి మరింత పెరిగి ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరుతుందని హుస్సేన్‌సాగర్‌ నాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.