Heavy Rains: తెలంగాణాలో అకాల వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం, గంటన్నర పాటు కురిసిన వర్షంతో తడిసి ముద్దయిన మేడారం, హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడే సూచనలు
heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Hyderabad, Febuary 9: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) శనివారం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతవరకు ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శనివారం ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కూడా కురిసింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) తాజాగా వెల్లడించింది.

తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో... తెలంగాణలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా కరీనంగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్‌లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వాతావరణం అత్యంత చల్లబడటంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణా సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు

ఇదిలా ఉంటే సమ్మక్క – సారలమ్మ మహా జాతర (Sammakka Saralamma Jatara) చివరి రోజైన శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షం వల్ల మేడారంలోని రోడ్లు, పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తడుచుకుంటూనే అమ్మవార్లను దర్శించుకున్నారు.

జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి

ప్రతి జాతర సమయంలో చిరుజల్లు పడటం ఆనవాయితీ. ఈ సారి వనదేవతలు గద్దెలపై ఉన్న క్రమంలో వర్షం కురవడం శుభసూచికంగా భక్తులు భావిస్తున్నారు. అకాల వర్షం పడటం వల్ల భక్తులు తడిబట్టలతో దర్శనం చేసుకుని తన్మయత్వం పొందారు.

జాతర సందర్భంగా విక్రయించడానికి సిద్ధం చేసుకున్న వస్తువులు, ఆహార పదార్థాలు తదితరాలు తడిసి ముద్దవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో నేలంతా చిత్తడిగా మారింది.