Hyderabad Drug Racket: రూ.5 వేల కరోనా ఇంజెక్షన్ రూ.30 వేలకు, హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠా, ఏడుమంది అరెస్ట్, వివరాలను వెల్లడించిన కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు
Hetero's COVIFOR antiviral drug for COVID-19. (Photo Credit: Twitter)

Hyderabad, July 20: కరోనావైరస్ కి ఇంకా పూర్తి స్థాయిలో మెడిసిన్ రాలేదు. ఉన్న మెడిసిన్లతోనే పేషెంట్లకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ మెడిసిన్లను కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ కొందరు (Hyderabad Drug Racket) అడ్డంగా దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ ముఠా బ్లాక్ మార్కెట్లో కరోనా మందులను (Black marketing drugs) విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. కోవిడ్‌–19 చికిత్స కోసం వాడే రేమ్‌డిసివీర్, సిఫ్రినీ ఇంజెక్షన్లను అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఓ ముఠాను కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలో 45 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, జీహెచ్ఎంసీలో తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు, జిల్లాల్లో విజృంభిస్తున్న కరోనావైరస్

కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆసుపత్రిలోని ఓపీ ఫార్మసీలో అబ్దుల్‌ అజీజ్‌ పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫార్మసీలో రేమ్‌డిసివీర్‌ (కోవిఫర్‌) ఇంజెక్షన్‌ కోసం జనం అడుగుతుండటంతో వాటిని ఎలాగైనా తెచ్చి అధిక ధరకు అమ్మాలని పథకం వేశాడు.ఆలివ్‌ హాస్పిటల్‌లోనే స్టాఫ్‌ నర్సుగా పని చేసే ఈ.రాజును కలవగా.. అతను రేమ్‌డిసివీర్‌ను రూ. 19,000 లకు అమ్ముతానని చెప్పాడు. మార్కెట్లో రెమ్ డెసివిర్ ఒక్క ఇంజెక్షన్ ధర రూ.5వేల 500 మాత్రమే.

ఎల్బీ నగర్‌లోని మెడిసిస్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేసే ఎల్‌.సునీల్‌ సైతం రెమ్‌డిసివీర్‌ను (remdesivir (Covifor) injections) రూ. 6500 సరఫరా చేస్తున్నాడని తెలిపాడు. అదే విధంగా ఎం.రవి కూడా తాను రూ. 10,000 రెమ్‌డిసీవీర్‌ ఇంజెక్షన్‌ అజీజ్‌కు సరఫరా చేస్తానన్నాడు. కాగా ఈ విధంగా అజీజ్‌ 11 రెమ్‌డిసివీర్‌ ఇంజెక్షన్లతో పాటు ఒక సిఫ్రినీ ఇంజెక్షన్‌ను ( Cipremi injection) ఎం.రాజు, ఎం.రవిల వద్ద కొన్నాడు. కాగా వీటిని అజీజ్‌ మహ్మద్‌ మాజిద్‌ అలీకి ఒక్కో ఇంజెక్షన్‌ రూ.20,000లకు అమ్మాడు.

మాజిద్‌ అలీ వీటిని మరో నిందితుడు మహ్మద్‌ అఫాక్‌ అలీకి అధిక ధరలకు అమ్మాలని ఇచ్చాడు. కాగా ఈ ఇంజెక్షన్లను ఆసిఫ్‌నగర్‌లోని సమీర్‌ ఆస్పత్రిలోని ఫార్మసీలో పని చేసే మహ్మద్‌ ఒబెద్‌కు రూ. 28,000 లకు అమ్మాడు. ఒబెద్‌ సమీర్‌ ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మక్కై వాటిని అధిక ధరలకు అమ్మకానికి పెట్టాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ వి. గట్టు మల్లు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆసిఫ్‌నగర్‌కు వచ్చారు. ఏడుగురు నిందితులు ఒబెద్, మహ్మద్‌ అఫాక్‌ అలీ, మహ్మద్‌ ఆజిద్‌ అలీ, అబ్దుల్‌ అజీజ్, రాజు, సునీల్, రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జోరుగా ఆక్సిజన్ సిలిండర్ల దండా నడుస్తోంది. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కృతిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. పోలీసులు ఎంత నిఘా పెంచినా, అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.