Interstate Travel Row: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు, త్వరలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం, అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సూచనలు..
Image used for representational purpose. TSRTC Buses. | Photo - Wikimedia Commons

Hyderabad, August 24: మరికొద్ది రోజుల్లో అన్‌లాక్ 3 ముగియనుండటంతో కేంద్రం అంతరాష్ట్ర సర్వీసులపై (Interstate Travel) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అన్‌లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఇందులొ భాగంగా తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య బస్సులను తిరిగి పునరుద్దరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ (APSRTC And TSRTC) అధికారుల మధ్య త్వరలో హైదరాబాద్‌లో చర్చలు (Interstate-travel discussions) జరుగనున్నాయని వార్తలు వస్తున్నాయి.

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా, ఇంతవరకూ రాష్ట్ర పరిధిలో హైదరాబాద్ మినహా, మిగతా ప్రాంతాల్లో మాత్రమే బస్సులను నడిపించాలని గతంలో కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నిన్న అధికారులతో జరిగిన సమీక్షలో, అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రస్తావనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారని సమాచారం.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉండరాదని, ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోకుండా, రెండు ఆర్టీసీలూ సమానంగా బస్సులను నడిపేలా చూసుకుంటూ, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల లెక్కలు కూడా ఉండేలా డీల్ కుదుర్చుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలతోనూ ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆదేశించిన ఆయన, ఉమ్మడి ఏపీలో సైతం ఇదే విధమైన ఒప్పందాలు ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తరువాత అవి ఏపీకి మాత్రమే పరిమితమయ్యాయని గుర్తు చేసినట్లుగా వార్తలను బట్టి తెలుస్తోంది. తెలంగాణలో కొత్తగా మరో 1842 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,06,091కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 761కు పెరిగిన కరోనా మరణాలు

లాక్ డౌన్ ముందు లెక్కలను పరిశీలిస్తే, తెలంగాణలోకి 1000కిపైగా ఏపీ బస్సులు వస్తుండగా, తెలంగాణ నుంచి ఏపీకి 750 బస్సులే వెళుతుండేవి. టీఎస్ లోని 2.50 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏపీ బస్సులు తిరుగుతూ ఉండగా, ఏపీలో టీఎస్ బస్సులు 1.50 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. ఈ విషయాన్నే ప్రస్తావించిన కేసీఆర్, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఇందులో భాగంగానే ఆదాయ నష్టం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బస్సులను తిప్పేందుకు ఏపీ సిద్ధంగానే ఉందని, మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, బస్సులను వెంటనే ప్రారంభించవచ్చని అధికారులు వెల్లడించగా, పరిస్థితులను విశ్లేషించి, ఉన్నతాధికారులే తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఆదివారంలోగా హైదరాబాద్ లో సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఏపీలో రిజర్వేషన్ చేసుకునే గడువు పెంపు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చింది. కోవిడ్‌–19 కారణంగా ఇంతకుముందు ఏడు రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్‌కు బస్‌ సర్వీసులు తిప్పడంపై ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో నేడు భేటీ కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,53,111కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3282కు పెరిగిన కరోనా మరణాలు

ఇప్పటివరకు ఏపీఎస్‌ఆర్టీసీ కర్ణాటకకు మాత్రమే సర్వీసులు నడుపుతోంది. తమిళనాడు, తెలంగాణలకు సర్వీసులు లేవు. ఈ రాష్ట్రాలకు ప్రైవేటు బస్సులు కూడా తిరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించడంతో సెప్టెంబర్‌ 1 నుంచి ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను తిప్పనుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఎప్పటి నుంచి సర్వీసులు తిప్పాలనే అంశంపై సోమవారం నిర్ణయం వెలువడనుంది. రెండు రాష్ట్రాల మధ్య సమానంగా అంతరాష్ట్ర బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీలు గతంలోనే అవగాహనకు వచ్చాయి.