KCR Fires on Modi: అమెరికా రాజకీయాల్లో వేలు పెట్టడం అవసరమా? అంటూ మోదీపై కేసీఆర్ ఫైర్, కొత్త స్పూర్తి కోసం కొత్త చట్టం రావాల్సిందేనన్న తెలంగాణ సీఎం, అవసరమైతే జాతీయ పార్టీ పెడతా!
ప్రధాని మోదీ (PM Modi) అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు (Trump) మద్దతివ్వడంపై కూడా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో (America Elections) మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు.
Hyderabad, Feb 13: ప్రధాని మోదీ (PM Modi) అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు (Trump) మద్దతివ్వడంపై కూడా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో (America Elections) మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు. బుద్ది ఉన్న ప్రధాని ఎవరైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అని నిలదీశారు. మరోవైపు దేశానికి కొత్త రాజ్యాంగం (Rewriting Constitution) రావాలన్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు.
గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో....కేసీఆర్ (KCR) క్లారిటీ ఇచ్చారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదిగేందుకు కొత్తచట్టం కావాలని, కొత్త స్పూర్తి రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది… దీన్ని అడ్డుకునేందుకు కొత్త రాజ్యాంగం రాయాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ (Rahul Gandhi)విషయం మాట్లాడాను తప్ప, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
అటు దేశంలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ (Hijab) వివాదంపైనా కేసీఆర్ స్పందించారు. ఈ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని.. కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ (BJP) విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలన్నారు. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ప్రగతి భవన్ లో (Praghathi Bhavan) మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో (BJP Must Go)… బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.
”నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది… దమ్ముంటే నన్ను జైల్లో వేయండి. మమ్మల్ని కాదు… మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ (Rafale Deal) గురించి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో (Supreme court) కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు (Modi Sarkar) దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతామని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధ విమానాలను (Rafale Fighters) కేవలం 8 బిలియన్ డాలర్లకే కొంది. మనకంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడం లేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో అనేది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం” అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశ రాజకీయాలు, సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చూస్తామని.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనా ఆ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. యూపీ ఎన్నికల ఫలితాలపైనే బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ ఆ పార్టీ తిరిగి యూపీలో అధికారంలోకి వస్తే, కేంద్రంలో వచ్చే లోక్సభ ఎన్నికల వరకూ ఆ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. కానీ, యూపీ ఎన్నికల్లో పరాజయం పొందితే మాత్రం కేంద్రంలోనూ బీజేపీ దెబ్బతింటుంది. లుకలుకలు మొదలై, ఎవరి దారి వారు చూసుకుంటారు. బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ కూడా బయటకువస్తారు. త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం’’ అని చెప్పారు
కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం వల్లనే.. బీజేపీ అవినీతిపై మాట్లాడటానికి భయపడుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహారశైలికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు తనతో మాట్లాడుతున్నారని, అయితే ఆయా పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావటం కంటే, దీనిపై ప్రజల్లోనే పెద్దఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను త్వరలో హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ఆలిండియా సర్వీసు మాజీ అధికారుల భేటీకి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే 15 శాతం మంది హాజరుకాకపోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్త పరిణామాలు, జాతీయ అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 13, 2022 09:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

