IMD Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తెలంగాణను తాకనున్న రుతుపవనాలు, ఐఎండీ అలర్ట్
Hyderabad, June 04: ఎండలు (summer)మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు ఏపీ(AP), తెలంగాణ (Telanagana) నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మాడు పగిలిపోయేలా ఉన్న ఎండ వేడి తాళలేక చెమట్లు కక్కుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ హాట్ సమ్మర్ లో ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా? ఈ మండే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు (monsoon) తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 4, 2022
” ప్రస్తుతం నైరుతి రుతుపవనాల (South west monsoon) కదలికలో కాస్త మందకొడి కారణంగా ఇంకా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ కాలేదు. గత నెల 29న కేరళను (Kerala) తాకిన తర్వాత రెండు రోజుల పాటు స్తబ్దుగా మారాయి. ప్రస్తుతం మళ్లీ పుంజుకొని వేగంగానే కదులుతున్నాయి. బెంగళూరు వరకు నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో జూన్ 7 లేదా 8 వరకు విస్తరిస్తాయి. ప్రస్తుత హీట్ టెంపరేచర్ రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఎంటరయ్యే ముందు ఉష్ణోగ్రతలు ఇలాగే ఎక్కువగా ఉంటాయి. ఈసారి కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుంది” అని వాతావరణ శాఖ అధికారి శ్రావణి వెల్లడించారు.
దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారం నైరుతి రుతుపవనాలే. కాగా, సాధారణ తేదీ జూన్ 1 కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27నే అవి కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది.
మరోవైపు కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.
ఇది ఇలా ఉంటే.. భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండలు భగభగ మండుతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనే నానుడిని నిజం చేస్తూ దద్దరిల్లుతున్నాయి. ఈ నాలుగు నెలల ఎండాకాలంలో తొలి రోజుల్లో ఎండలు తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచే కొద్ది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మామూలు ఎండల వేడినే తట్టుకోలేమంటే రోహిణిలో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. తీవ్రమైన ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు.
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఉదయం 7 నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం 6గంటల వరకు ఎండతాపం తగ్గడం లేదు. రాత్రి సమయంలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఫ్యాన్, కూలర్, ఏసీ వేసుకున్నా ఎండ తాపం తగ్గడం లేదని జనాలు వాపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఎండలు పోయి వర్షాలు కురవాలని, వాతావరణం చల్లబడాలని కోరుకుంటున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 04, 2022 11:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

