Nagarjuna Sagar By Election 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 86.82 పోలింగ్ శాతం నమోదు, కరోనా ఉన్నప్పటికీ ఓటేసేందుకు ఆసక్తి చూపిన ఓటర్లు, మే 2వ తేదీన ఫలితాలు
తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) నమోదైంది.ఈ ఉపఎన్నికలో 86.82 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
Nagarjuna Sagar, April 18: తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) నమోదైంది.ఈ ఉపఎన్నికలో 86.82 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్ కావడంతో 86.46 శాతం పోలింగ్ నమోదైంది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగింది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది.
కరోనా ప్రమాద ఛాయలు కనిపిస్తున్నా.. యువకులు, మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా నాగార్జునసాగర్, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో 8 గంటలకు ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో పాటు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఏజెంట్లు ఆలస్యంగా వచ్చారు. ఫలితంగా ఆయా మండలాల్లో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
ఉదయమే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి సాగర్లో, టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ హాలియాలో, బీజేపీ అభ్యర్థి రవికుమార్ త్రిపురారం మండలంలోని పలుగుతండాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఉదయాన్నే వచ్చి క్యూలైన్లో ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడం, కొన్ని చోట్ల టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కొవిడ్ నిబంధనల మేరకు క్యూలైన్లో ఓటర్ల మధ్య భౌతికదూరం పాటించేందుకు సున్నంతో వృత్తాలు గీశారు. ఓటర్లకు పేపర్ గ్లోవ్స్ అందజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలకుడు చౌహన్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
(The above story first appeared on LatestLY on Apr 18, 2021 09:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

