![](https://test1.latestly.com/wp-content/uploads/2022/06/Singireddy-Niranjan-Reddy-1-380x214.jpg)
Hyd, june 29: రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎక్కువ భూమి ఉన్న వారికే రైతుబంధు ( Rythu Bandhu Funds) అనేది అవాస్తవం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి (minister-niranjan-reddy) ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు
9వ విడుత రైతుబంధు కింద లబ్ధిదారులకు రూ. 7,508 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ రెండు ఎకరాల్లోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు నగదును జమ చేశామని పేర్కొన్నారు. 24.68 లక్షల ఎకరాలకు రూ. 1,234.09 కోట్లు జమ చేశామని ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో ఎకరా, రెండు ఎకరాలు ఉన్న వారికి రూ. 1820.75 కోట్లు జమ చేశామన్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు ఆర్థిక సాయం అందిందని తెలిపారు. 10 ఎకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు అందిస్తుందని రూ. 250 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదు ఎకరాలు ఉన్న వారు 92.50 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.