
Hyderabad, Oct 5: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఈ నెల 7న పోలీసు ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమావేశం (CM KCR Meeting Update) నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా శాంతిభద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం వంటి విషయాలపై చర్చించనున్నారు.
ఈసమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ( police higher officials) హాజరుకానున్నారు.
ఏసీబీ అధికారుల కస్టడీలో ఏసీపీ నర్సింహారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని (ACP narasimha reddy) ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. నర్సింహారెడ్డిని (Senior Telangana Cop ACP Narasimha Reddy) నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి (ACB Office) ఈ ఉదయం తరలించారు.మాదాపూర్ సైబర్ టవర్ల ఎదురుగా ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని చేజిక్కించుకునేందుకు మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి భారీ స్కెచ్ వేసినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది.
ఆక్రమాస్తులు రూ. 50 కోట్లకు పైమాటే, మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంపై ఏసీబీ దాడులు
దాదాపు రూ.50 కోట్ల విలువచేసే 1,960 చదరపు గజాల భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చి కొట్టేయడంలో పాత్రధారులుగా ఉన్న 8 మందిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్లోని 1,960 చదరపు గజాల ప్రభుత్వభూమిని రిజిస్ట్రేషన్ చట్టం, 1980లోని సెక్షన్ 22-ఏ(1)(ఏ) కింద ఏపీఐఐసీ, హుడా, ఇతర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమికి యజమానులుగా గోపగోని సజ్జన్గౌడ్, పోరెడ్డి తిరుపతిరెడ్డి, ఎర్ర చంద్రశేఖర్, అర్జుల జైపాల్ అలియాస్ గాలిరెడ్డి ఉన్నట్టు పత్రాలు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు.
తర్వాత ఈ భూమిని వారివారి కొడుకుల పేరిట గిఫ్ట్డీడ్ కింద విక్రయించినట్టుగా 2016లో పత్రాలు పుట్టించారు. 2018లో అదే భూమిని ఏసీపీ నర్సింహారెడ్డి తన భార్య మంగతోపాటు మధుకర్ శ్రీరాం, బండి చంద్రారెడ్డి, బత్తిని రమేశ్, అలుగుబెల్లి శ్రీనివాస్రెడ్డి పేరిట రిజిస్టర్ చేయించాడు. ఇందుకోసం ఒక్కో స్థలానికి రూ. 20 లక్షల చొప్పున రూ.80 లక్షలు చెల్లించినట్టుగా పత్రాలు సృష్టించారు.
ఈ భూమి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.6 కోట్లు ఉంటుంది. దాన్ని వీళ్లు సృష్టించిన పత్రాల్లో రూ.4కోట్లుగా పేర్కొన్నారు. వాస్తవంగా ఈ భూమికి మార్కెట్ విలువ రూ.50 కోట్లు ఉంటుంది. అదీకాక, ఈ భూమి శేరిలింగంపల్లి మండలంలో ఉంటే ఎల్బీనగర్లో రిజిస్టర్ చేయడం ఆశ్చర్యపరిచే అంశం.
రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మిన నలుగురికి భూమి కొన్న నలుగురు సాక్ష్యులుగా సంతకాలు పెడితే, కొన్నవారికి ఆ అమ్మినవారే సాక్షి సంతకాలు పెట్టడం మరో ట్విస్ట్ గా చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో ఉన్న ఎనిమిది మందితో ఏసీపీ నర్సింహారెడ్డికి సంబంధం ఏంటి? వీరంతా నర్సింహారెడ్డి బినామీలా? ఈ భూమితోపాటు ఇంకేవైనా భూముల అవకతవకల్లో ఈ ఎనిమిది మందికి సంబంధాలు ఉన్నాయా? అన్న విషయాలు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నది.