CM KCR Review: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితం, జూన్ 7న ప్రారంభిస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
జూన్ 7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (KCR) నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad, June 5: జూన్ 7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (KCR) నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం (Telangana CM KCR) చర్చించారు. ప్రజలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు. పేదలకు జబ్బు చేస్తే ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. దశల వారీగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ.. ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో (Diagnostic Centers) 57 పరీక్షలు ఉచితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణలో ప్రతి పౌరుడికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు ఇస్తామని, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సిఎం అన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో , రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తుందన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోస్టిక్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్దంగా వున్న 19 కేంద్రాల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు.. మహబూబాబాద్, భద్రాద్రి, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని సీఎం తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jun 05, 2021 04:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

