Dalit Bandhu Scheme: నలుదిక్కులా దళితబంధు అమలు, మరో నాలుగు మండలాలకు పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి

హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం...

Dalit Bandhu Scheme: నలుదిక్కులా దళితబంధు అమలు, మరో నాలుగు మండలాలకు పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి
Telangana CM KCR | Photo: CMO

Hyderabad, September 14: తెలంగాణలో మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరచి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తర తరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయంతో, సామాజిక బాధ్యతతో నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలులోకి తెచ్చామని సీఎం పునరుద్ఘాటించారు.

హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. వాసాలమర్రి, హుజూరాబాద్ లలో ప్రకటించిన విధంగానే ఈ నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు.

దళితబంధు పథకం దేశంలోనే మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్న ఆలోచన. ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేసినవారమౌతామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధును ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ఇమిడి ఉన్నదని సీఎం తెలిపారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఎదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లో నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు.

వ్యాపార ఉపాధి రంగాల్లో రిజర్వేషన్

ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్ షిప్ లు, ట్రాన్స్ పోర్టు పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బారు, వైన్ షాపులు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ‘‘అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేనని సీఎం స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అంబేద్కర్ మహాశయుడుఅందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమి జరుగలేదని సీఎం అన్నారు.

దళితబంధు పథకం కింద డైయిరీ యూనిట్స్ కు స్పందన ఎక్కువగా వస్తున్నందున ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ సహకార డైయిరీలతో ఒక జాయింట్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రజలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సగటున ఎన్ని పాలను వినియోగించాలి? ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారు? రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది? బయటి రాష్ట్రాల నుండి ఎంత దిగుమతి చేసుకుంటున్నారు? అనే అంశాలమీద సమీక్ష జరిపి దళితబంధులో డైయిరీ యూనిట్లను ప్రొత్సహించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ యూనిట్లను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు.

ఇక, ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం అందించే పథకం దేశంలో ఎక్కడా లేదని కొనియాడారు. దళితబంధు పైలట్ ప్రాజెక్టు మండలాల్లో రాజకీయాలకు అతీతంగా తన మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు తన నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళితబంధు పథకం అమలు కోసం తన శాయశక్తుల కృషిచేస్తానని ఆయన తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 14, 2021 08:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).